Wednesday, December 29, 2010

పశ్చిమ కనుమలలో ప్రయాణం

ఓ రెండురోజుల క్రితం చిక్కమగళూరు, ఆ చుట్టుప్రక్కల చూద్దామని బయలుదేరాము. ముఖ్యంగా, కెమ్మనగుండి. కెమ్మనగుండి గురించి ఇంతకుముందు చాలాసార్లు విని, చదివి, తప్పకుండా చూడవలసిందే అని తీర్మానించి, ఇప్పుడు వీలుకుదరడంతో బయలుదేరాము. బెంగళూరులో ఉదయం 6:30 కి బయలుదేరి, నేలమంగళ, హాసన్ మీదుగా హళేబీడు వెళ్లి అక్కడ శివాలయాన్ని దర్శించి అక్కడనుండి బేళూరు వెళ్లి అక్కడ చెన్నకేశవ స్వామిని దర్శించుకున్నాము. ఈ హళేబీడు, బేళూరు దేవాలయ కట్టడాలు పూర్తిగా కాకపోయినా కోణార్క్ కట్టడాలకు దగ్గరగా ఉన్నాయి. కోణార్క్ సూర్యదేవాలయాన్ని కట్టించింది కూడా కన్నడ (గంగా అనుకుంటా) రాజవంశస్థులే.



అక్కడనుండి చిక్కమగళూరు మీదుగా పశ్చిమకనుమలలోకి బయలుదేరాము. దారికిరువైపులా కొబ్బరి తోటలు, పోక తోటలు భలేఉన్నాయి. ఇంకొంచం ముందుకెళ్లేసరికి దట్టమైన అడవి మొదలయ్యింది. దారి అస్సలు బాగోలేదు. ముందు బాబా బుడాన్‌గిరి వెళ్లి అక్కడనుండి కెమ్మనగుండి వెళ్లాము.


నిజానికి ఈ దారి కొద్దిగా చుట్టూ తిరిగి అయినా ఇవన్నీ చూసుకుంటూ వెళ్లాము కాబట్టి పెద్దగా విసుగనిపించలేదు. కెమ్మనగుండి వెళ్లేసరికి చీకటిపడింది, అక్కడే కృష్ణ రాజేంద్ర వసతిగృహంలో బసచేసి


మర్నాడు ఉదయం హెబ్బె జలపాతాన్ని చూడ్డానికి వెళ్లాము, ఆ దారి చాలా దారుణంగా ఉంది, వెళ్తే నడిచి వెళ్లాలి లేదా జీపులో వెళ్లాలి, వేరే రకంగా వెళ్లే అవకాశమే లేదు. అది 13 kms దూరమేకాని, ఓ నలభై కి.మీ దూరంలా అనిపించింది :)



అక్కడనుండి మద్యాహ్నం బయలుదేరి అరిసికెరె, త్రిప్టూరు, తుముకూరు మీదుగా మళ్లీ బెంగళూరు చేరుకున్నాము. మొత్తానికి ఎప్పట్నుంచో అనుకుంటున్న కెమ్మనగుండి చూడాలనే కోరిక తీరింది, కొద్దిగా కష్టమనిపించినా ;)

బాబా బుడాన్‌గిరి, కెమ్మనగుండి ప్రదేశాల్లో, కాఫీ, మిరియాలు, ఏలకులు, వెనీలా, వక్కలు, అల్లం బాగా పండిస్తారు.

No comments: